
కృష్ణమ్మ ఉరక.. లోతట్టు మునక
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని ఎగువ భాగంలో జోరుగా వానలు కురుస్తుండడంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్లో కల్లోళ, యడూర, మలికవాడ, దత్తవాడ, నిప్పాణి తాలూకా బారవాడ, కున్నూర, కరదగ, భోజ వంతెనలు జలావృతం అయ్యాయి. ఈ మార్గంలో కర్ణాటక, మహారాష్ట్రల మధ్య వాహన రాకపోకలు స్తంభించాయి. ఆల్మట్టి డ్యాం నుంచి 25 గేట్లను తెరిచి కృష్ణానదికి 80,250 క్యూసెక్కుల నీటిని వదిలారు. బెళగావి, గోవా రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. పుణెలో ఆలయంలోకి వరద నీరు చేరాయి. కుసుమలి వద్ద మలప్రభ నదికి అడ్డంగా నిర్మించిన వంతెన నీట మునిగింది. ఇక ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో నదీ తీర లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాధికారులు హెచ్చరించారు. బెళగావి జిల్లాలో బెణ్ణేతుప్రి వాగు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. ఏళ్ల తరబడి నూతన వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా ప్రతినిధులు వంతెన పనులను పూర్తి స్థాయిలో ముగించడానికి నిధుల కొరతను సాకుగా చెబుతున్నారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా హువిన హడగి వద్ద ఉన్న గడ్డగోళి బసవేశ్వర ఆలయం వరద నీటిలో మునిగింది.

కృష్ణమ్మ ఉరక.. లోతట్టు మునక