
రక్షిత తాగునీటి వాడకం తప్పనిసరి
● జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అక్రమ్ అలీ షా సూచన
హొసపేటె: ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పరిశుభ్రమైన తాగునీటిని తాగడం తప్పనిసరి అని జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అక్రమ్ అలీ షా తెలిపారు. నగరంలోని జెడ్పీ కార్యాలయ హాలులో శుక్రవారం జరిగిన జిల్లా నీరు, పారిశుద్ధ్య మిషన్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో అంటు వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆరోగ్యం దృష్ట్యా, స్వచ్ఛమైన తాగునీటిపై శ్రద్ధ వహించాలన్నారు. బావులు, గొట్టపు బావులు, నిల్వ ట్యాంకులు వంటి ఇళ్లలో ఉపయోగించే నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఆర్ఓ ప్లాంట్లు, జల్జీవన్ మిషన్ ద్వారా సరఫరా చేసిన తాగునీటిని తాగాలన్నారు. బోరుబావుల నుంచి నేరుగా నీటిని తాగరాదన్నారు. వీలైతే నీటిని కాచి చల్లార్చి తాగాలన్నారు. కలుషిత నీటితో కలరా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. దోమల నుంచి రక్షణ పొందాలన్నారు. మీ ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలన్నారు. హాపి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రజని షణ్ముఖ గౌడ మాట్లాడుతూ హంపీలోని ఎంపీ.ప్రకాష్ నగర్లో తాగునీటి సరఫరా కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అన్నారు. బైలువద్దిగేరి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు జే.లక్ష్మీదేవి, జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ కే.తిమ్మప్ప, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య విభాగం జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దీప, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేష్, రామచంద్రప్ప, ఆరోగ్య శాఖ జిల్లా సర్వేయర్ డాక్టర్ షణ్ముఖ్ నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రవికుమార్, ఐసీడీఎస్ అధికారిణి సుభద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.