
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
సాక్షి,బళ్లారి: భార్యాభర్తల మధ్య గొడవలు చివరకు అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను కూడా హరించాయి. నిత్యం భార్యాభర్తల గొడవలు పతాక స్థాయికి చేరడంతో ఆ తల్లి తాను చనిపోతే తన పిల్లల బాగోగులను ఎవరు చూస్తారని భావించి, తాను నవమాసాలు మోసి, కని పెంచిన ముగ్గురు సంతానాన్ని కూడా బావిలోకి తోసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బెళగావి జిల్లా నుంచి గొర్రెలను మేపుకునేందుకు వచ్చిన సంజయ్కుమార్, సిద్దమ్మ దంపతులు తమ ముగ్గురు పిల్లలను తీసుకుని కురుగోడు తాలూకాకు రెండు నెలల క్రితం వచ్చారు. రెండు నెలల నుంచి టెంటు వేసుకుని, గొర్రెలను మేపుకుంటూ జీవించేవారు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు పెద్దవి కావడంతో ఆ తల్లీ బిడ్డలు రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన కురుగోడు పోలీసులు స్థానికంగా పొలంలోని ఓ బావిలో శవాలు తేలడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
భర్త వేధింపులే కారణంగా అనుమానం
తన పిల్లలైన అభిజ్ఞ(9), అవని(6), ఆర్య(4) అనే ముగ్గురిని బావిలోకి తోసి, తల్లి సిద్ధమ్మ(28) తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులే భార్యాపిల్లల ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో సంజయ్కుమార్ను కురుగోడు పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్కుమార్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారని, బెళగావి జిల్లాకు చెందిన సిద్ధమ్మను వివాహం చేసుకుని గొర్రెలను మేపుకుంటూ జీవించేవారని తెలిపారు. ప్రతి ఏటా వేసవిలో అక్కడ గొర్రెలకు మేత ఇబ్బంది కావడంతో బళ్లారి జిల్లాకు వచ్చేవారు. ఈ ఏడాది కూడా గొర్రెలను మేపేందుకు రాగా భార్యాభర్తల మధ్య గొడవలు పతాకస్థాయికి చేరడంతో ఆ తల్లి చిన్నారులను కూడా చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుందని స్థానికులు వాపోయారు. భార్యాభర్తల గొడవలతో చిన్నారులు కూడా అర్థంతరంగా తనవు చాలించడం అందరినీ కలిచి వేసింది. ఈ ఘటనపై కురుగోడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు చిన్నారులను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య
వేధించిన భర్తను అరెస్ట్ చేసిన
కురుగోడు పోలీసులు