
గర్భిణిని చంపి, భర్త ఆత్మహత్య
బంట్వాళ వద్ద ఘోరం
యశవంతపుర: ఎన్నో ఏళ్లయినా సంతానభాగ్యం లేదు. లేకలేక భార్య గర్భం దాల్చింది. కానీ అమ్మా అనిపించుకోకుండానే కన్నుమూసింది. గర్భిణి అయిన భార్యను హత్య చేసిన భర్త, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా నావూరులో బుధవారం రాత్రి జరిగింది. నావూరు గ్రామం బడగుండికి చెందిన తిమ్మప్ప రామమూల్య (52), భార్య జయంతి (45)ని గొంతు పిసికి హత్య చేశాడు. వివరాలు.. వీరికి సుమారు 20 ఏళ్ల కిందట పెళ్లయింది, సంతానం లేదు, ఇటీవలే జయంతి గర్భం దాల్చింది.
వచ్చే నెలలో సీమంతం చేయాలని నిర్ణయించారు. అయితే దంపతుల మధ్య గొడవలు చెలరేగాయి. తిమ్మప్ప ఆవేశం పట్టలేక ఆమెను చితకబాది గొంతు పిసికి హత్య చేసి తాను ఉరివేసుకున్నాడు. జయంతి మృతదేహం ఓ గదిలో ఉండగా, వంట ఇంట్లో తిమ్మప్ప ఉరికి వేలాడుతున్నాడు. ఈ ఘోరంతో బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇరువైపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.