
పుస్తకాల పంపిణీ
రాయచూరు రూరల్: విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొనాలని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మరిస్వామి పేర్కొన్నారు. గురువారం షియా తలాబ్ ప్రభుత్వ పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ నాయకులుగా ఎదగాలన్నారు. నగరసభ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, ఫైజల్ ఖాన్, శ్యాం సుందర్, భీమరాయ, వీరనగౌడ, ప్రతాప్ రెడ్డి, వీరణ్ణ, రశీద్, మధు, అజీంలున్నారు.
మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని విద్యా భారతి విద్యా సంస్థ అధ్యక్షుడు రవి రాజేశ్వర్ అన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులను గౌరవించి పెద్దలు, గురువుల మార్గదర్శకత్వంలో ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలన్నారు. విద్యార్థులు పచ్చదనం వృద్ధి, ప్లాస్టిక్ రహిత నగరానికి కృషి చేయాలన్నారు. నగరసభ రెవిన్యూ అధికారి సంగమేశ్వర్, శ్రీనివాస్, వెంకటేష్, మోహన్, హరీష్ మూర్తి, అజిత్ కులకర్ణి, కాత్యాయిని, వీరేష్, సుజాత, శివరంజని, ఈరమ్మ, లక్ష్మిలున్నారు.
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: అన్న భాగ్య పథకం కింద పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న ఘటన నగరంలో జరిగింది. బుధవారం రాత్రి ఎన్జీఓ కాలనీలో జమ్ములమ్మ దేవాలయం వద్ద బోలెరో వాహనంలో తీసుకెళ్తున్న 41 బస్తాల బియ్యాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి శివమూర్తి నేతృత్వంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్, రమేష్, శివరాజ్లను అరెస్టు చేశారు.
ప్రధానోపాధ్యాయుడిని తొలగించాలి
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకాలోని యలగట్ట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని తొలగించాలంటూ రెండు రోజుల నుంచి పాఠశాల ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. గురువారం ప్రభుత్వ హైస్కూలు ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చేపట్టిన నిరసనలో సంచాలకుడు రమేష్ మాట్లాడారు. యలగట్ట ప్రభుత్వ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు నాగనగౌడ పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారని ఆరోపించారు. గత మూడు నెలల నుంచి విధులకు గైర్హాజరైన నాగనగౌడను సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లా, తాలూకా విద్యాశాఖాధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఇద్దరు చిన్నారుల జలసమాధి
● ఆడుకుంటూ చెరువులో పడి మృతి
హుబ్లీ: ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ పక్కనే ఉన్న చెరువులో పడి మూడేళ్ల కవల పిల్లలు మృతి చెందిన ఘటన జిల్లాలోని కుందగోళ తాలూకా ఎర్రినారాయణపురలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన షరీఫ్ సాబ్ కవల పిల్లలైన ముజమిల్(3), ముదిక్చీర్(3) ఈ దురంతంలో తుది శ్వాస వదిలిన ముక్కుపచ్చలారని పిల్లలు. తండ్రి షరీఫ్ సాబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తల్లి పని కోసం హుబ్లీకి వెళ్లిన సందర్భంలో ఆ ఇంట్లో అవ్వ మాత్రమే ఉంది. ఈ సమయంలో ఆమె ఇంటి పనుల్లో నిమగ్నం కాగా పసిపిల్లలు ఆడలాడుతూ ఇంటి పక్కన ఉన్న చెరువు వద్దకు వెళ్లి నీటిలో పడి మునిగి పోయారు. ఇంట్లో పిల్లలు కనబడకపోవడంతో వెదకగా ఈ ఘటన వెలుగు చూసింది. కాగా పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆవేదన కట్టలు తెంచుకుంది. ఘటన స్థలానికి తహసీల్దార్ రాజు, టీపీ ఈఓ, జగదీశ్ కమ్మార, కుందగోళ పోలీస్ అధికారులు వచ్చి పరిశీలించారు.

పుస్తకాల పంపిణీ

పుస్తకాల పంపిణీ

పుస్తకాల పంపిణీ