
మామిడి ధర దిగులు.. తోటలోనే వ్యాపారి మృతి
శ్రీనివాసపురం: మామిడి ధరలు గణనీయంగా తగ్గి రైతులు, వ్యాపారులు తీవ్రనష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో గురువారం మామిడి తోటలో వ్యాపారి ఇదే దిగులుతో గుండెపోటు వచ్చి చనిపోయాడు. కోలారు జిల్లా శ్రీనివాసపురం పట్టణానికి చెందిన మామిడి వ్యాపారి మహమ్మద్ షఫీవుల్లా అలియాస్ అన్వర్ (55) మృతుడు. ఫ్రూట్ మండీ వ్యాపారి అన్వర్ ఏటా సీజన్లో మామిడి ఎగుమతి వ్యాపారం చేసేవాడు. ఈసారి తొట్లి గ్రామంలో మామిడి తోటను తీసుకొన్నాడు. మామిడి కాయలు కోస్తుండగా గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మరణించాడు. అన్వర్ ఈ దఫా రూ. 30 లక్షల మామిడి వ్యాపారం చేశాడు. ధరలు తగ్గడం వల్ల మామిడి తోటకు కొట్టిన మందుల ఖర్చు కూడా రాదని బాధపడేవాడని బంధువులు తెలిపారు. గిట్టుబాటు ధరను ప్రకటించాలని గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా రైతులు, వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. అన్వర్ కూడా పాల్గొన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తహసీల్దార్ సుధీంధ్ర అన్వర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.