
బెంగళూరు యువకుని కిరాతకం
పెళ్లి చేసుకుందామని ప్రయాణం
అనుమానం పెనుభూతమైంది
నిందితుడు కెవిన్ అరెస్టు
బనశంకరి: కన్నడిగ ప్రేమ జంట గోవా టూర్లో దురంతం చోటుచేసుకుంది. ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలిసింది. దక్షిణ గోవా పోలీసులు ప్రతాప్నగర వద్ద దార్బందోరా అటవీ ప్రదేశంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియున్ని అరెస్ట్ చేశారు. ఈ జంట వివాహం చేసుకోవాలని బెంగళూరు నుంచి గోవా కు వెళ్లారు. కానీ అతని చేతిలో యువతి హత్యకు గురైంది. నిందితుడు బెంగళూరు ఉత్తర నివాసి సంజయ్ కెవిన్ (23) గా పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన యువతి రోష్ని మోసెస్ (22), ఈమె స్వస్థలం హుబ్లీ అని సమాచారం.
అడవిలోకి వెళ్లి..
గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంజయ్ కెవిన్, రోష్ని పెళ్లి చేసుకుందామనుకున్నారు. సంజయ్ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు, రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్లో పనిచేసేది, వారికి కాలేజీ రోజుల్లోనే పరిచయమై ప్రేమగా మారింది. చాలాఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఇక పెళ్లాడాలని గోవా ట్రిప్కు వెళ్లారు. శనివారం రాత్రి బస్సులో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ గోవా పరిధిలోని దార్బందోరా అనే ప్రాంతంలో దిగిపోయారు. ఇద్దరూ సమీప అడవిలోకి వెళ్లారు, అక్కడ సంజయ్ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, ఆమె ఫోన్ను తీసుకుని వెళ్లిపోయాడు. ట్యాక్సీలో హుబ్లీకి చేరుకున్నాడు.
బస్సు టికెట్లే క్లూ
మంగళవారం నుంచి హత్య విషయం బయటపడింది. వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. రోష్ని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లు దొరకడంతో ఓ క్లూ లభించింది. పలు బస్టాండ్లలో సీసీ కెమెరాల చిత్రాలను సేకరించి ఆ జంట చిత్రాలను సంపాదించారు. అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి బుధవారం సాయంత్రం కల్లా అరెస్టు చేశారు.
అనుమానంతో హత్య : ఎస్పీ
దక్షిణ గోవా ఎస్పీ తికమ్సింగ్ వర్మ మాట్లాడుతూ రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్ అనుమానం పెంచుకున్నాడని, హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా తీసుకున్నాడని తెలిపారు. మాయమాటలు చెప్పి ఆమెను గోవాకు తీసుకువచ్చాని చెప్పారు. ఎంతో క్లిష్టమైన కేసును ఛేదించామని తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రోష్నిని తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుని బెంగళూరుకు వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిసింది.