రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్వర్క్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల బకాయి వేతనాలను చెల్లించాలంటూ మంగళవారం ఏడో మైలు వద్ద రాస్తారోకో చేపట్టారు. తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్వర్క్ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు మానసయ్య ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. కర్ణాటక నీటిపారుదల మండలి పరిధిలో సిరవార, సింధనూరు, యరమరస్ డివిజన్లో 748 మంది గ్యాంగ్మెన్లకు ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఇంజినీర్ విజయలక్ష్మి పాటిల్ కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, ఆమైపె చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. రోజు 8 గంటల పని వ్యవధి కన్నా మించి పని చేయించుకున్నారన్నారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న ఘటనా స్థలానికి ఇంజినీర్లు, తహసీల్దార్ సురేష్ వర్మ చేరుకుని కార్మిక నేతలతో చర్చలు జరిపి 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. రెండు గంటల పాటు రహదారి దిగ్బంధనం కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళనలో అడవిరావు, గంగాధర, అమరేష్, బసవరాజ్, రుక్కప్ప, ఆంజనేయ, రాధాకృష్ణ, ముదుకప్ప, హన్మంతప్ప, అమరేగౌడలున్నారు.