బనశంకరి: తెలుగు, కన్నడిగులకు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినం త్వరలో రాబోతోంది. ప్రజలు సొంతూళ్లకు వెళ్లే పనిలో ఉన్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు గిరాకీ పెరిగింది, ఇదే అదనుగా బస్సుల యజమానులు నిలువు దోపిడీకి దిగారు. టికెట్ రేట్లను పెంచి దోచేస్తున్నారు. 29 నుంచి ఉగాది, రంజాన్ వరుస సెలవులు వస్తున్నాయి. 28వ తేదీ శుక్రవారం నుంచి రద్దీ ఆకాశాన్నంటుతోంది. రైళ్లు, ఆర్టీసీ బస్సులు దొరకనివారు ప్రైవేటు బస్సు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రైవేటు బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు 30 నుంచి 50 శాతం చార్జీలను పెంచేశాయి. అంత చెల్లిస్తేనే టికెట్ దొరుకుతుంది. పిల్లాపాపలతో ఊరికివెళ్లేవారికి ఇది చాలా భారమైనా గత్యంతరం లేదని వాపోయారు.
ఎక్కువ పెంచలేదు
ఉగాది రద్దీ దృష్ట్యా ఈనెల 20 నుంచి 26 తేదీ వరకు బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు 2 వేల అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రైవేటు బస్సులు యజమానుల సంఘం అధ్యక్షుడు నటరాజ్శర్మ మాట్లాడుతూ టికెట్ రేట్లను ఎక్కువగా పెంచలేదని చెప్పారు.
భారీగా చార్జీలను పెంచిన
ప్రైవేటు ట్రావెల్స్
ప్రైవేటు ట్రావెల్స్లో కొన్ని ప్రాంతాలకు చార్జీలు ఇలా ఉన్నాయి
బెంగళూరు టు ధారవాడ
మామూలు రూ.600–1100
పండుగ రూ.1069–5500
బెంగళూరు టు మంగళూరు
మామూలు రూ.650–1300
పండుగ రూ.1200–4500
ఉగాది ప్రయాణం.. ఎంతో ప్రియం