థార్‌ జీప్‌ బీభత్సం.. ఇద్దరు రిజర్వు కానిస్టేబుళ్ల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

థార్‌ జీప్‌ బీభత్సం.. ఇద్దరు రిజర్వు కానిస్టేబుళ్ల దుర్మరణం

Aug 15 2023 1:22 AM | Updated on Aug 15 2023 7:41 AM

- - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం చెందారు.

మైసూరు: మైసూరు నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం చెందారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో బైక్‌ను థార్‌ జీప్‌ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రాష్ట్ర రిజర్వు పోలీసు విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు మహేశ్‌ (23), అమర్‌నాథ్‌ (24) అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని కుంబార కొప్పళకు చెందిన పి మహేశ్‌, బీజాపుర జిల్లా జమఖండి తాలూకాకు చెందిన అమరనాథ్‌లు ఐదో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

వీరిద్దరు రాత్రి 10.30 గంటల సమయంలో నగరంలోని సిద్ధార్థ లేఔట్‌ సమీపంలోని ఫుడ్‌స్ట్రీట్‌లో భోజనం చేసి పల్సర్‌ బైక్‌లో కేఎస్‌ఆర్పీ బెటాలియన్‌ కేంద్రానికి బయలుదేరారు. నగరంలోని లలిత్‌ మహల్‌ హోటల్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన థార్‌ జీప్‌ వీరి బైక్‌ను వేగంగా ఢీకొంది.

దాదాపు పది మీటర్ల వరకు వారిని లాక్కెళ్లింది. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. థార్‌ జీప్‌ నడిపిన వ్యక్తి పారిపోయాడు. సిద్దా నగర ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement