హుజూరాబాద్: అఖిల భారత పోలీస్ క్రీడాపోటీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి సత్తాచాటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈనెల 9 నుంచి 13 వరకు జరిగిన పోటీల్లో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో నాలుగు పతకాలు సాధించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో జరిగిన హోరాహోరీ పోటీల్లో ఏసీపీ మాధవి తన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఆకట్టుకున్నారు. విధుల్లో తీరికలేని అధికారిణిగా సేవలందిస్తూనే క్రీడల్లోనూ రాణించడం విశేషంగా మారింది. టేబుల్ టెన్నిస్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం, జీవో 40ప్లస్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం సాధించారు. ఎన్జీవో మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం కై వసం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఒకే జాతీయ పోటీల్లో రెండు విభిన్న క్రీడల్లో పతకాలు సాధించడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. పతకాలు సాధించిన ఏసీపీ మాధవిని సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. సహచర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


