నిజామాబాద్‌ జిల్లాలో జగిత్యాల వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ జిల్లాలో జగిత్యాల వాసి మృతి

Nov 5 2025 7:29 AM | Updated on Nov 5 2025 7:29 AM

నిజామాబాద్‌ జిల్లాలో  జగిత్యాల వాసి మృతి

నిజామాబాద్‌ జిల్లాలో జగిత్యాల వాసి మృతి

నిజామాబాద్‌ జిల్లాలో జగిత్యాల వాసి మృతి బైక్‌లు ఢీకొని యువకుడు.. స్వగ్రామానికి మృతదేహం

జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్‌ మండలం గోపాల్‌రావుపేటకు చెందిన రౌతు గంగాధర్‌ అలియాస్‌ ఆలూరు రెడ్డి (35) నిజామాబాద్‌ జిల్లా వేల్పుల మండలం పడకల గ్రామంలో సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆలూరురెడ్డి పడకలలో ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తున్నాడు. ఆయన మృతిచెందినట్లు ఇక్కడి కుటుంబసభ్యులకు సమాచారం అందగా.. వారు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేస్తూ అతని సోదరుడు రౌతు శేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలూరురెడ్డి ఫిట్స్‌తో మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నా.. అతని శరీరంపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసినట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామ శివారులో రెండు బైక్‌లో ఎదురెదురుగా ఢీకొనడంతో విజయవాడకు చెందిన చిట్టిమేను సాయిలోకేశ్‌ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పెద్దపల్లిరూరల్‌ ఎస్సై మల్లేశ్‌ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం రాయపేటలో మిత్రుడి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి సాయిలోకేశ్‌, షణ్ముఖ్‌ వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో వారిని రైలు ఎక్కించేందుకు పెద్దంపేటకు చెందిన పోలుదాసరి రాజు బైక్‌పై తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో హన్మంతునిపేట శివారులో ఎదురుగా బైక్‌పై వస్తున్న యువకుడు ఆటోట్రాలీని ఓవర్‌టేక్‌ చేయబోయి బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ రాజు, సాయిలోకేశ్‌, షణ్ముఖ్‌ను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక అనంతరం కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిలోకేశ్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు.

రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపెల్లి సతీశ్‌గౌడ్‌ ఈనెల 1న గల్ఫ్‌లో గుండెపోటుతో చనిపోగా మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. సతీశ్‌గౌడ్‌ ఇంటికి వస్తాడని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు పెట్టెలో విగతజీవిగా రావడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. అశ్రునయనాల మధ్య బంధువులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. నిరుపేద అయిన సతీశ్‌ అంత్యక్రియలు, తదుపరి కార్యక్రమాలకు కాలనీవాసులు, గ్రామస్తులు తోచిన విధంగా ఆర్థికసాయం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

నరేశ్‌ అంత్యక్రియలు అక్కడే చేయండి..

మెట్‌పల్లి: ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లి.. ఐదేళ్ల క్రితం అక్కడే మరణించిన పట్టణానికి చెందిన శ్రీపాద నరేశ్‌ మృతదేహానికి ఆ దేశంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించడం సాధ్యంకాదని అక్కడి ఇండియన్‌ ఎంబసీ అధికారులు స్పష్టంచేయడంతోపాటు అక్కడే అంత్యక్రియలు చేసేలా అతని కుటుంబ సభ్యుల సమ్మతి కోరారు. దీంతో వారు తమ సమ్మతిని తెలుపుతూ నోటరీ అఫిడవిట్‌ను మృతుడి సోదరుడు ఆనంద్‌ మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి హైదరాబాద్‌లో ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డికి అందించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో వచ్చే శుక్రవారం అక్కడ అంత్యక్రియలు జరగనుండగా.. పాల్గొనడానికి మృతుడి సోదరుడు ఆనంద్‌ అక్కడకు బయలుదేరి వెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement