● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
కరీంనగర్టౌన్: టీచర్ల దమ్మేందో, తపస్ ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే ఏమైతదో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని శుభం గార్డెన్లో తపస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజయ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా టీచర్ల కోసం కొట్లాడే ఏకై క సంఘం తపస్లో చేరాలని పిలుపునిచ్చారు. తపస్ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకు టిక్కెట్ ఇప్పించి సునాయాసంగా గెలిపించిందన్నారు. తెలంగాణ సాధనలో టీచర్లు, ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు.
బీఆర్ఎస్ పాలన పీడ విరగడ కావాలని ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నాడని మండిపడ్డారు. 15 నెలలుగా హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచిస్తూనే ఉందన్నారు. ఉద్యోగులకు బకాయిలు ఇచ్చేందుకు డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం 18 శాతం కమీషన్ ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేస్తోందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలివ్వకుండా విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సమస్యలపై పోరాడాలని, తపస్ తల్చుకుంటే విద్యాశాఖ సమూలంగా ప్రక్షాళన కావాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసేస్తే, మీకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం విద్యార్థులకు కలం అందించి మహానుభావులుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే, కాంగ్రెస్ అందుకు భిన్నంగా పాఠ్యపుస్తకాల్లో అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని జొప్పించి తుపాకీ రాజ్యం కోసం కుట్రలు చేస్తుంటే సమాజానికి ఏ సందేశం పంపినట్లు అని ప్రశ్నించారు. అసలు ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి అర్బన్ నక్సల్స్ను విద్యా కమిషన్లో నియమించారో సమాధానం చెప్పాలన్నారు. ఈ విధానాన్ని తపస్ కచ్చితంగా వ్యతిరేకించి ఉద్యమం ప్రారంభించాలని, బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో తపస్ రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.