● అదనపు కలెక్టర్ విక్టర్
● ప్రజావాణిలో 67 దరఖాస్తుల స్వీకరణ
కామారెడ్డి టౌన్ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని సత్వరమే పరిష్కరించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 67 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం పాటిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి పాండు, శిక్షణ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా, మూడు మామిడి తండాలలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ అటవీశాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు సుభాష్, రమేష్, కమల, సరోజ, కిషన్, మంజుల, అనూష, లక్ష్మి, లాల్య తదితరులు పాల్గొన్నారు.
డోంగ్లీలో వినతి పత్రం అందిస్తున్న గ్రామస్తులు
మండలం ఫిర్యాదు
ఎల్లారెడ్డి 4
తాడ్వాయి 3
కామారెడ్డి 3
మహమ్మద్ నగర్ 3
నాగిరెడ్డిపేట 2
జుక్కల్ 1
తాడ్వాయి/ఎల్లారెడ్డిరూరల్/కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/నాగిరెడ్డిపేట/మద్నూర్: మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు నామమాత్రంగా వచ్చాయి. ప్రజావాణికి అన్ని శాఖలు అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని అధికారులు తెలిపారు. మండల, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు మద్నూర్ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. పాఠశాలలో ఎన్సీసీ కోర్సు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని విద్యార్థులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డోంగ్లీ ప్రజావాణిలో గ్రామస్తులు వినతి పత్రం అందించారు.


