● వృద్ధ దంపతుల నుంచి నగదు, వెండి
ఆభరణాలు అపహరించిన దుండగులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో మాయమాటలు చెప్పి వృద్ధ దంపతుల నుంచి వెండి ఆభరణాలు, నగదును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మెదక్ జిల్లా హావేలీ ఘణపూర్ మండలం పోచమ్మరాల్తండాకు చెందిన మూడ్ కేస్లీ, ఆమె భర్త సక్రీయ సోమవారం షుగర్ మాత్రల కోసం గోపాల్పేటకు వచ్చారు. బస్టాండ్ సమీపంలోని ఓ మెడికల్ దుకాణం వద్దకు వెళ్తుండగా వారిని గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పలకరించాడు. మాయమాటలు చెప్పడంతోపాటు వారిపై గుర్తుతెలియని మత్తు మందును చల్లాడు. దీంతో వెంటనే మత్తులోకి వెళ్లిన కేస్లీ దుండగుడు అడిగిన వెంటనే మెడలో ఉన్న 12 తులాల వెండిగోలుసుతోపాటు తన వద్దనున్న పర్సును అప్పగించింది. అనంతరం దుండగుడు మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను పిలిపించుకొని స్కూటీపై పారిపోయారు. వారు వెళ్లిపోయిన తర్వాత తేరుకున్న వృద్ధదంపతులు వెంటనే తాము మోసపోయామని తెలుసుకొని నాగిరెడ్డిపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ మండలకేంద్రలలోని పలు దుకాణాలలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి దుండగుల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.


