ఓటర్లలో అయోమయం
జిల్లాలో ‘సర్’ నోటీసులు, హియరింగ్ వివరాలు..
● నత్తనడక నోటీసుల పంపిణీ!
● ఇప్పటికీ ముప్పై శాతమే..
● హైరానా పడుతున్న ఓటర్లు
● బీఎల్వోలపై పెరిగిన ఒత్తిడి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా నో మ్యాపింగ్, అనామలిస్ జాబితాలో ఉన్న వారికి నోటీసుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆ ప్రభావం హియరింగ్పై పడుతోంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో సర్ నోటీసుల జా రీ ప్రక్రియ కొనసాగుతోంది. నో మ్యాపింగ్కు సంబంధించి 19,157 మంది, అనామలిస్ జాబితాలో 1,65,585 మంది ఉన్నారు. మొత్తంగా 1,84,742 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 61,886 మందికి నోటీసులు ఇచ్చారు. ఇంకా 1,22,856 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఇప్ప టి వరకు 6,627 మంది ఓటర్లు హియరింగ్కు హాజరై తమ ఆధారాలను చూపించారు. అయితే నోటీసుల డౌన్లోడ్, ప్రింటింగ్ ఆలస్యం అవడం, పంపిణీకి ఎక్కువ సమయం తీసుకుంటుండడంతో ముందుకు సాగడం లేదు. కాగా, చిన్నచిన్న తప్పులకే నోటీసులు వస్తుండడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. అక్షర దోషాలు ఉన్నా అనామలిస్ జాబితాలో చేరాయి. నోటీసులు అందుకున్న వారు తమకు కేటాయించిన రోజున ఏదైనా పని ఉందంటే ఆ రోజు వెళ్లలేకపోతున్నారు. నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది హియరింగ్కు హాజరుకాలేకపోతున్నారు.
జిల్లా కేంద్రంలో నెమ్మదిగా..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నోటీసుల జారీ ఆలస్యంగా నడుస్తోంది. ఇప్పటి వరకు కేవలం 20 శాతం మాత్రమే పంపిణీ జరిగింది. మున్సిపల్ పరిధిలో మొత్తం 64 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వీటిలో 5,268 నో మ్యాపింగ్ ఓటర్లు ఉండగా, 15,784 మంది అనామలిస్ జాబితాలో ఉన్నారు. మొత్తంగా 26,108 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, కేవలం 4,793 మందికి మాత్రమే నోటీసులు అందజేశారు. ఇంకా 21,315 మందికి నోటీసులు అందించాల్సి ఉంది. ఈ లెక్కన 20 శాతం కూడా పంపిణీ జరగలేదు. 784 మంది హియరింగ్ జరిగింది. నోటీసుల విషయంలో బీఎల్వోలపై ఒత్తిడి పెరుగుతోంది. అందరికీ సమాధానాలు ఇవ్వాల్సి ఉండటం, ఇళ్లు వెతుక్కొని వెళ్లి నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు.
కొందరు ఓటర్లకు నోటీసులు వస్తుండడంతో మిగతావాళ్లు తమ ఓటు ఉందో లేదోనన్న అయోమయంలో ఉన్నారు. అవగాహన ఉన్నవారు ఇటీవల విడుదల చేసిన జాబితాలో తమ పేరును చెక్ చేసుకుంటున్నారు. అయితే, అవగాహన లేక, చదువురాని వాళ్లు చాలా మంది ఓటు విషయంలో బీఎల్వోల దగ్గరకు వెళ్లి ఆరా తీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది లేదు గానీ, పట్టణాల్లోనే అసలు సమస్య ఉంది. బీఎల్వోలు ఎక్కడుంటారో తెలియని పరిస్థితుల్లో ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? లేకుంటే నోటీసు ఎప్పుడిస్తారు ? అన్న దానిపై హైరానా పడుతున్నారు. చాలామంది బీఎల్వోలకు ఫోన్ చేసి తమకు నోటీసు రాలేదని అడుగుతున్నారు.
నియోజకవర్గం నో మ్యాపింగ్ అనామలిస్ నోటీసులు జారీ అందజేసినవి పెండింగ్ హియరింగ్
జుక్కల్ 2,764 51,463 54,227 22,045 32,182 1.756
ఎల్లారెడ్డి 3,727 52,733 56,460 20,762 35,698 2,062
కామారెడ్డి 12,666 61,389 74,055 19,079 54,976 2,809
మొత్తం 19,157 1,65,585 1,84,742 61,886 1,22,856 6,627


