హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
● కొనసాగుతున్న పనులు
● ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం
నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్ఫాస్ట్ పథకం వచ్చే దసరాలోపు జిల్లాలో అందుబాటులోకి రానున్నది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్డు ద్వారా పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు బ్రేక్ఫాస్ట్ సరఫరా చేయనున్నది. నిజాంసాగర్ మండల కేంద్రంలోని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ, సబ్ మార్కెట్ యార్డు గోదాంను సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్డుకు కేటాయించారు. ప్రస్తుతం గోదాంలో సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 83 వేల మంది విద్యార్థులున్నారు. అయితే, జిల్లాలోని 790 పాఠశాలలు, 13 జూనియర్ కళాశాలలకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్డు ద్వారా హరేకృష్ణ మూవెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ సరఫరా చేయనున్నారు. ప్రభుత్వం ట్రస్ట్కు ఈ పథకాన్ని అప్పగించడంతో సదరు సంస్థ నేతృత్వంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వారీగా ఉన్న విద్యార్థుల ఎన్రోల్మెంట్ను ట్రస్ట్ ఉద్యోగులు సేకరించారు. ఇదిలా ఉండగా ఇతర జిల్లాలకు సరిహద్దులో కిచెన్ షెడ్డు ఉండటంతో అక్కడి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సైతం బ్రేక్ఫాస్ట్ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే దసరా నుంచి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందనున్నట్లు తెలిసింది.


