● సబ్ జైలును తనిఖీ చేసిన
జిల్లా న్యాయమూర్తి నాగరాణి
కామారెడ్డి టౌన్ : ఖైదీలు శిక్ష అనంతరం సన్మార్గంలో నడవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి. నాగరాణి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయ సేవలు, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరు, సంక్షేమ వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని తెలిపారు. కుల బహిష్కరణలు, దొంగతనాల వంటి నేరాలకు దూరంగా ఉండాలని, శిక్ష కాలం ముగిశాక సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా సన్మార్గంలో జీవించాలని హితవు పలికారు. బెయిల్, అప్పీళ్లు, లోక్ అదాలత్ తదితర సేవలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం జైలు వంటగది, పారిశుధ్యం, తాగునీటి వసతులు, ఫిర్యాదుల పెట్టెను పరిశీలించి, ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ మాయా సురేశ్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ కౌన్సెల్ విఠల్ రావు, జైలు సూపరింటెండెంట్ సీహెచ్. సంజీవ్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ, జైలు సిబ్బంది పాల్గొన్నారు.


