నాగిరెడ్డిపేట: వచ్చేనెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని డీఈవో రాజు సూచించారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్పేట మోడల్స్కూల్లో జనగణన ఎన్యుమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను జనగణన ప్రక్రియలో పాటించాలని సూచించారు. పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. ఆయనవెంట ఆర్ఐ మహేశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లా వ్యాప్తంగా మంగళవారం 58 మందికి శిక్షలు పడ్డాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు ఆయా కోర్టులలో హాజరుపరచగా.. నలుగురికి రెండు రోజులు, మరో నలుగురికి ఒక రోజు జైలు శిక్షలతో పాటు మొత్తం 58 మందికి కలిపి రూ.75 వేలు జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద ఇంగ్లిష్ మీడియం 3, 5, 8 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని 208వ నంబర్ గదిలో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. మంగళవారం కామారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రాజానగర్ అంగన్వాడీ కేంద్రంలో ’పోషణ్ మాసోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం పీడీ ప్రమీల మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచి ఆరోగ్యంగా పెంచాల్సిన బాధ్యత తల్లులపై ఉందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో పద్మ, సూపర్వైజర్ కవిత, కౌన్సిలర్లు భానుప్రకాష్, డీసీ ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.


