కామారెడ్డి టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌళిక వసతులు కల్పించాలని, విద్యార్థుల భద్రతకోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు చరణ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ విక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హాస్టల్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వారి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వరుసగా విద్యార్థులు మరణిస్తున్నా, హాస్టళ్లపై దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బాలికల హాస్టళ్లకు ప్రహరీ గోడలు, కిటికీలు, సీసీ కెమెరాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రభుత్వం స్పందించి భద్రత చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కౌశిక్, అక్షయ్, అజార్, శివ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


