తాడ్వాయి: మక్క, జొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తాడ్వాయిలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విఠల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పంటను వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారి మీదుగా తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, తహసీల్దార్ శ్వేతకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీకేఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నాయకులు రవీందర్రావు, సంతోష్రెడ్డి, వెంకట్రావు, రాజిరెడ్డి, భుజంగ్రావు, విఠల్రెడ్డి, గంగారెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


