ఎల్లారెడ్డి: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి బస్టాండ్లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఏమిలి అరుణ్ (45) అనే వ్యక్తి పండ్లు కొనుగోలు చేయడానికి ఎల్లారెడ్డి బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్లాడు. తిరిగి బయటకు వస్తున్న సమయంలో కామారెడ్డి నుంచి నిజాంసాగర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొన్నది. బస్సును డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన అరుణ్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి సురేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లంలో ఉ న్న దత్తాత్రేయ మందిరం పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు గంగారాం మహరాజ్(75) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బో ర్లం గ్రామంలోనే తుదిశ్వాస విడిచారు. గ్రామంలో తన సొంత నిధులు, భక్తులు అందించిన సహకారంతో దత్తాత్రేయ మందిరాన్ని నిర్మించారు. ఆయన మృతికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పించారు.
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పట్టణ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేయగా వారి నుంచి రూ.7,590, సెల్ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు.


