కామారెడ్డి టౌన్ : రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంట (గోల్డెన్ అవర్) బాధితుల ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ‘అరైవ్ – అలైవ్’లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘గోల్డెన్ అవర్’ ప్రాధాన్యతపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్వో ఆధ్వర్యంలో వైద్యులు సీపీఆర్, ప్రథమ చికిత్సపై ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎదుటివారు ఎలా డ్రైవింగ్ చేసినా, మన జాగ్రత్తతో ప్రమాదాలను నివారించడమే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అన్నారు. దీనిపై ప్రతి వాహనదారుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజల సహకారం, పోలీస్ శాఖ కఠిన చర్యల వల్ల గతేడాదితో పోలిస్తే జిల్లాలో సుమారు 50 రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు నరసింహారెడ్డి, చైతన్యరెడ్డి, డీఎంహెచ్వో రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


