● జాగ్రత్తగా వాహనం నడిపి,
సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి
● అదనపు డీజీపీ సంజయ్ జైన్
గాంధారి: మన ప్రాణాలు, కుటుంబాలకన్నా ఏదీ ముఖ్యం కాదని అదనపు డీజీపీ సంజయ్ జైన్ పేర్కొన్నారు. జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ –అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ జైన్ మాట్లాడుతూ యుద్ధాలలోకన్నా రోడ్డు ప్రమాదాలలో మరణించేవారే ఎక్కువన్నారు. అమెరికా –ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నెలన్నరలో సుమారు 3,500 మంది మరణించారని, కానీ మన దేశంలో ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 20 వేల మంది మరణించారని పేర్కొన్నారు. కొందరి వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి ఎస్పీ రాజేశ్ చంద్ర పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ కంటి వైద్య శిబిరాన్ని అదనపు డీజీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేణుక సంజివ్, తహసీల్దార్ రేణుకా చౌహాన్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, స్థానిక ఎస్సై మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


