● వెంటనే బదిలీ చేయండి
● ఎంపీడీవో రాజేశ్వర్కు వినతి పత్రం ఇచ్చిన తిమ్మాపూర్ సర్పంచ్, గ్రామస్తులు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని వెంటనే బదిలీ చేయాలని, ఈ కార్యదర్శి మాకొద్దంటూ బుధవారం ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణకు తిమ్మాపూర్ సర్పంచ్ శంకర్తో పాటు గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చారు. సర్పంచ్తో పాటు గ్రామస్తులందరూ ట్రాక్టర్లో ఎంపీడీవో కార్యాలయానికి తరలి వచ్చి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి జ్యోతిశ్రీ సమయ పాలన పాటించడంలేదని, పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని సర్పంచ్ ఆరోపించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగు నీటి సమస్యల గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎవరైనా గ్రామస్తులు సమస్యల గురించి గట్టిగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పనుల గురించి పట్టించుకోవడంలేదని, పనులు జరిగే చోట కనీసం తాగు నీరు కూడా అందుబాటులో ఉంచడంలేదని ఆరోపించారు. ఏ విషయమైనా నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని, సర్పంచ్కు సైతం కనీస మర్యాద ఇవ్వడంలేదని ఆరోపించారు. అందుకే కార్యదర్శిని వెంటనే బదిలీ చేసి మరో కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు ఎంపీడీవోను కోరారు.


