● జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
● భిక్కనూరు, బీబీపేట,
వెల్పుగొండలలో 42.8 డిగ్రీలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వారం రోజులుగా క్రమంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం జిల్లా అంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో రైతులు, కూలీలతో పాటు వివిధ వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు వేడితో అల్లాడిపోతున్నారు. మంగళవారం జిల్లాలో అత్యధికంగా భిక్కనూరు, బీబీపేట మండల కేంద్రాలతో పాటు పాల్వంచ మండలం వెల్పుగొండలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పిట్లంలో 42.7 డిగ్రీలు, మద్నూర్ మండలం సోమూర్, మేనూర్, ఎల్లారెడ్డి మండలం మాచాపూర్, గాంధారి మండల కేంద్రాల్లో 42.6 డిగ్రీలు నమోదయ్యాయి. నస్రుల్లాబాద్, ఇసాయిపేటలో 42.3 డిగ్రీలు, సదాశివనగర్లో 42.2, జుక్కల్, కొల్లూర్లలో 42.1, సర్వాపూర్, కామారెడ్డి, దోమకొండలలో 41.9, డోంగ్లీ, బొమ్మన్దేవ్పల్లి, బిచ్కుంద, బీర్కూర్లో 41.8, పాత రాజంపేటలో 41.7, పుల్కల్లో 41.4, రామారెడ్డిలో 41.2, రామలక్ష్మణ్పల్లిలో 41.1, తాడ్వాయిలో 40.9, లింగంపేట, లచ్చాపేటలలో 40.8, హసన్పల్లి, ఆర్గొండలలో 40.7, పెద్దకొడప్గల్లో 40.3, నాగిరెడ్డిపేటలో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఎండలతో హడలిపోతున్న జనం...
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో జనం హడలిపోయారు. ఉదయం 10 గంటలకే ఎండ మండిపోవడంతో జనం రోడ్లపై తిరగడానికి ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం పూట ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడతో షాపింగ్, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాలన్నా జంకుతున్నారు. వడగాలులు కూడా వీస్తుండడంతో ఇబ్బందిపడుతున్నారు.


