● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ: భారతరత్న బాబా సాహెబ్ అంబేడ్కర్ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా బాన్సువాడలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి దిక్చూచి వంటి రాజ్యాంగాన్ని రచించిన రూపశిల్పి అంబేడ్కర్ అని అన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే నడుస్తూ సమానత్వ భారత నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు.
బాధతోనే అలా మాట్లాడా..
అభివృద్ధి పనుల విషయంలో కొంత మంది నాయకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధతోనే అలా మాట్లాడానని పోచారం శ్రీనివాస్రెడ్డి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. వర్ని మండలంలోని సిద్దాపూర్ ఎత్తిపోతల పథకం వద్ద రెండు రోజుల క్రితం ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినా మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రభుత్వంపై తన అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ విషయమై బాన్సువాడలో ఆయన మంగళవారం మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే అలా మాట్లాడానని చెప్పారు. డీఎస్పీ విఠల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మబేగం, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్లు దొన్కంటి శ్యామల, రుక్మిణీ, నిజామాబాద్ డీసీ హెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


