ఎకరాకు 40 క్వింటాళ్లపైనే దిగుబడి..
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండడంతో పలువురు రైతులు ప్రత్యామ్నాయంగా మక్క, జొన్న పంటల సాగు చేశారు. జిల్లాలో యాసంగి సీజన్లో 40,580 ఎకరాల్లో మక్క పంట సాగయ్యింది. తాడ్వాయి, గాంధారి, రాజంపేట, లింగంపేట, సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద తదితర మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు.
దళారులు చెప్పిందే ధర..
మొక్కజొన్న పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అద నుగా దళారులు ధరను గణనీయంగా తగ్గించారు. ప్ర భుత్వం నిర్ణయించిన ధర క్వింటాలుకు రూ. 2,400 అయితే దళారులు చాలాచోట్ల రూ. 1,700 నుంచి రూ. 1,800 లకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు క్వింటాలుకు దాదాపు రూ. 7 వందలు నష్టపోతున్నా రు. ఎండలు మండుతున్నా అకాల వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిస్తే దళారులు ధరను మరింత తగ్గించే అవకాశం ఉంది. కాగా మక్కలు కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి కూడా గోదాములు అందుబాటులో లేవని తెలుస్తోంది. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేయకపోవడం ఇబ్బందికరంగా మారిందని రైతులు అంటున్నారు. మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయాలని, ఎకరాకు 25 క్వింంటాళ్లు అన్న నిబంధన ఎత్తివేసి పూర్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో రైతులు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. మక్కలు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో మార్క్ఫెడ్ జిల్లా అధికారి శశిధర్రెడ్డిని వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడచుకుంటామని పేర్కొన్నారు.
ఈసారి పంట బాగుండడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. ఎకరాకు తక్కువలో తక్కువ 40 క్వింటాళ్లు వస్తోంది. కొందరు రైతులకై తే 45 క్వింటాళ్ల పైనే దిగుబడి వచ్చింది. మక్క పంట ఆశాజనకంగా ఉండి, దిగుబడి పెరగడంతో రైతులు ఎంతో సంతోషించారు. మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించారు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. ఎంఎస్పీ ప్రకారం రూ.90 వేలకుపైగా ఆదాయం వస్తుంది. అయితే దళారులు ఎకరాకు రూ.1,700 చొప్పున కొనుగోలు చేస్తుండడంతో ఎకరాకు రూ.20 వేలకుపైగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ఆసక్తి చూపుతున్నా.. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. మక్క సాగు చేసిన రైతులు క్వింటాలుకు రూ. 700 వరకు నష్టపోవాల్సి వస్తోంది. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు
ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400..
దళారులు చెల్లిస్తోంది
రూ. 1,700 మాత్రమే..
నష్టపోతున్న రైతులు


