మక్కల పైసలు రాలే..
● నెలలు గడుస్తున్నా చెల్లింపులు లేవు
● జిల్లాలో 5,750 మంది రైతులు..
● రూ.63.20 కోట్లు అందాల్సి ఉంది
● అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు దిగుబడిని అమ్మినా డబ్బులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మక్కల కొనుగోలు నుంచి డబ్బుల చెల్లింపుల వరకు ఏటా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈసారి మక్కలు అమ్మిన రైతులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. వానాకాలం సీజన్లో మార్క్ఫెడ్ రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలు కొనుగోలు చేయగా.. సగం మందికి కూడా డబ్బులు రాలేదు. దీంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు, అలాగే కోతకు చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. దళారులకు అమ్ముకుంటే ధర తక్కువగా వస్తుందనే ఉద్దేశంతో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులు ఇప్పుడు డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. జిల్లాలో 9,490 మంది రైతుల నుంచి 4,22,158 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశారు. మూడు నెలల కిందట అంటే డిసెంబర్ 10 లోగా 3,733 మంది రైతులకు రూ.38 కోట్ల 11 లక్షల 87 వేల 528 చెల్లింపులు జరిగాయి. తరువాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి 5,750 మంది రైతులకు రూ.63 కోట్ల 19 లక్షల 92 వేల 872 రావాల్సి ఉంది. మక్కలు అమ్మిన రైతులు డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తూనే ఉన్నారు. చాలా మంది రైతులు అధికారులకు ఫోన్లు చేసి డబ్బులు ఎప్పుడొస్తాయని అడుగుతున్నారు. కొందరు రైతులు మార్క్ఫెడ్ కార్యాలయానికి వెళ్తున్నారు. డబ్బులు రిలీజ్ కాగానే సమాచారం ఇస్తామని అధికారులు రైతులకు సర్దిచెప్పి పంపిస్తున్నారు. ఇటీవల పాల్వంచ మండల కేంద్రానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసిన కొందరు రైతులు.. మక్కల డబ్బుల కోసం వినతిపత్రం అందించారు. కాగా త్వరలోనే డబ్బులు జమవుతాయని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. పంట సాగు పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో మక్కల డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నారు.


