వీడని చిక్కుముడి!
కామారెడ్డి పట్టణ ఓటర్లు అన్ని పార్టీలను ఆదరించడంతో హంగ్ ఏర్పడింది. దీంతో బల్దియా పీఠం ఎవరి పరం అవుతుందన్నది చిక్కు ప్రశ్నగా మారింది. స్వతంత్రుల చేరికతో కాంగ్రెస్ బలం 22 కు చేరినా చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి మరో ముగ్గురి మద్దతు అవసరం. ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి బీజేపీ బలం 17 కు చేరినా మ్యాజిక్ ఫిగర్కు దూరంగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో 11 మంది సభ్యులున్న బీఆర్ఎస్ నిర్ణయం కీలకంగా మారింది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పు పురపీఠం చిక్కుముడిగా మారింది. చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా యి. తమ సభ్యులను ఇప్పటికే క్యాంపులకు తరలించాయి. బల్దియాను కైవసం చేసుకునేందుకు మూ డు ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. దీంతో మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దా నిపై క్లారిటీ రావడం లేదు. 19 వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లకు పార్టీలో చేర్చుకుంది. దీంతో వారి బలం 22 కు చేరింది. ఇదే సమయంలో 16 మంది కౌన్సిలర్ల ను గెలుచుకున్న బీజేపీ పార్టీకి ఎక్స్ అఫీషియో స భ్యునిగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఓటు కలిపితే వారి సంఖ్య 17 అవుతుంది. అయితే 11 మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందా? లేదా బీ జేపీతో జత కడుతుందా అన్నదానిపై రకరకాల ఊ హాగానాలు నడుస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉప్పునిప్పుగా వ్యవహరిస్తుండడంతో స్థానికంగా ఆ పార్టీతో బీఆర్ఎస్ నాయకులు జతకట్టే పరిస్థితులు కనబడడం లేదు. ఇదే సమయంలో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలూ తక్కువేనన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకు ల్లో వ్యక్తమవుతోంది.
క్యాంపుల్లో మూడు పార్టీల కౌన్సిలర్లు
ఫలితాలు వెలువడగా నే విజేతలందరినీ ఆ యా పార్టీలు క్యాంపులకు తరలించా యి. ఏ ఒక్కరూ చే జారిపోకుండా ఆ యా పార్టీల నేతలు జాగ్రత్త పడుతున్నా రు. క్యాంపుల్లో ఉన్న వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. కాగా ఈనెల 16న బల్దియాల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ని ర్వహిస్తారు. ప్ర మాణ స్వీకారం అనంతరం అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. సింగిల్ నామినేషన్ దాఖలైతే ఏ ఇబ్బందీ ఉండదు. అంతకుమించి నామినేషన్లు వస్తేనే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈలోపు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలపై ఆయా పార్టీల నేతలు సమాలోచనలు జరిపి, నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఫలితా లు వెలువడగానే స్వతంత్రులు ముగ్గు రిని తమవైపు తిప్పుకుని, వారికి కాంగ్రెస్ కండువా కప్పేసింది. చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి.
వేచి చూసే ధోరణి..
ఎమ్మెల్యే ఓటుతో కలిపి 17 ఓట్ల బలం ఉన్న బీజేపీ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ముఖ్యనాయకుడొకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. బల్దియాను కైవసం చేసుకోవాలంటే బీజేపీకి మరో ఎనిమిది మంది మద్దతు అవసరం. అన్ని పార్టీల కౌన్సిలర్లు క్యాంపులలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణిలో బీజేపీ ఉంది.
కామారెడ్డి బల్దియాను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. చైర్పర్సన్గా ఎవరికి అవకాశం ఇద్దామన్న విషయమై సమాలోచనలు జరుపుతోంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదలు శనివారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ ఇంట్లో సమావేశమయ్యారు. చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని క్యాంపులో ఉన్న కౌన్సిలర్లకు తెలిపి పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలని సూచించినట్లు సమాచారం.
బీఆర్ఎస్తో రాయబేరాలు
కాంగ్రెస్, బీజేపీలు బల్దియా పీఠాన్ని కై వసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి. అయితే ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో 11 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్గా మారింది. వారి మద్దతు కోసం ఇరు పార్టీలు రాయ‘బేరాలు’ నడుపుతున్నట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది.
‘కారు’ దారెటో?
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ను ఎదుర్కొంటున్న ప్రస్తుత కీలకమైన సమయంలో ఆ పార్టీలతో అవగాహన చేసుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు. లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఎన్నికకు దూరంగా ఉండే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కామారెడ్డి బల్దియాలో రసవత్తరంగా రాజకీయం
ఇండిపెండెంట్ల చేరికతో
22కు చేరిన కాంగ్రెస్ బలం
ఎమ్మెల్యే ఓటుతో బీజేపీ
బలం 17 కు చేరిక
కీలకం కానున్న బీఆర్ఎస్ నిర్ణయం


