ప్రలోభాల హోరు..!
● యథేచ్ఛగా నగదు, మద్యం పంపిణీ
● ఓటుకు నోటు.. గడప గడపకూ
మద్యం బాటిళ్లు
● గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చు
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల సమరం ముగుస్తున్న వేళ కామారెడ్డిలో ప్రలోభాల పర్వం పరాకాష్టకు చేరింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. నిన్నటి వరకు ప్రచారంతో హోరెత్తించిన నేతలు, ఇప్పుడు ‘నగదు.. మద్యం’ పంపిణీపై దృష్టి సారించారు. పట్టణంలోని పలు వార్డుల్లో రాత్రికి రాత్రే నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లు చేతులు మారినట్లు సమాచారం. గెలుపు కోసం ఎంతటి ఖర్చుకై నా వెనుకాడబోమని అభ్యర్థులు భీష్మించుకోవడంతో కామారెడ్డి వీధుల్లో ప్రలోభాల హోరు కనిపించింది.
వార్డుల్లో హడావుడి..
పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులు ఓటుకు ఇంత అని రేటు ఫిక్స్ చేసి పంపిణీ సాగిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియను కానిచ్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటి సభ్యుల సంఖ్యను బట్టి కవర్లలో నగదు పెట్టి నేరుగా ఓటర్ల చేతుల్లో పెడుతున్నట్లు తెలిసింది. కొత్త పట్టణంలో చైర్పర్సన్ రేసులో ఉన్న ఓ వార్డులో ప్రధాన పార్టీల వారు ఓటుకు రూ.3 వేలకు పైగా పంపిణీ చేసినట్లు సమాచారం. అన్ని వార్డుల్లో రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. ప్రధాన పార్టీలతో పాటు కొందరు స్వతంత్రులు సైతం పోటాపోటీగా మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. వార్డు కౌన్సిలర్లుగా విజయం సాధించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రలోభాల పర్వం సామాన్య ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.


