చేయిచేయి కలిపి.. విరాళాలు సేకరించి..
● పడావు భూమిని మైదానంగా మార్చారు
● లింగంపేటలో యువకుల చొరవ
లింగంపేట(ఎల్లారెడ్డి): ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని’ ఎదురు చూడకుండా ఏళ్ల తరబడి పడావుగా ఉన్న క్రీడా ప్రాంగణాన్ని యువకులు బాగుచేసుకున్నారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు చేయి చేయి కలిపి, రూ. 1.50 లక్షలు విరాళాలు సేకరించారు. క్రీడా ప్రాంగణాన్ని చదును చేసుకొని క్రీడలకు అనుకూలంగా మార్చుకున్నారు.
ఐదేళ్ల క్రితం కేటాయింపు..
గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణానికి స్థలం కేటాయించి బోర్డు ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి పనులు చేపట్టలేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మండలంలో క్రీడా మైదానం లేక క్రీడాకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈక్రమంలో లింగంపేట గ్రామానికి చెందిన రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రఫియోద్దీన్, మాజీ సర్పంచ్ అఫ్రోజ్లు సుమారు యాబైవేల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు చేసి క్రీడా ప్రాంగణాన్ని బాగుచేయడానికి నడుం బిగించారు. వారితో పాటు పలువురు యువకులు క్రాంతికుమార్, ఆశోక్, యుసుఫ్ఖాన్, బాషు, అర్షద్, ఖజా, అశ్వక్, రఘునందన్, వాసి, రియాజ్, వేణుగౌడ్, ఉమేష్, రవితేజ, సకి, ఉవేజ్అదనాన్, ఫారూక్, ఇంమ్రాన్, నవీద్, సాయితేజ, గ్రామ పెద్దలు సహకరించి స్థలంలో పనులు చేయడంతోపాటు విరాళాలు సేకరించారు. ప్రస్తుతం క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రావడంతో మండలంలోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేయిచేయి కలిపి.. విరాళాలు సేకరించి..


