బామ్మర్దుల దాడి.. బావ ఆత్మహత్య
మాచారెడ్డి: బావపై బామ్మర్దులు దాడి చేసిన ఘటనలో మనస్థాపానికి గురైన బావ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శుక్రవారం ఘటన చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. బండరామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన సుంకు ప్రవీణ్కు దోమకొండ మండల కేంద్రానికి చెందిన హారికతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. గత కొద్దిరోజులుగా ప్రవీణ్ పనిలేకుండా తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. గురువారం సైతం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయమై హారిక దోమకొండలోని తండ్రి, సోదరులకు సమాచారం అందించింది. దీంతో వారు బండరామేశ్వర్పల్లికి చేరుకొని ప్రవీణ్ను మందలించారు. దీంతో మాటామాట పెరిగి బావపై బామ్మర్దులు దాడి చేసి హారికను వారి వెంట తీసుకెళ్లారు. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్ సొంతింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
మద్నూర్(జుక్కల్): పోతంగల్ మండలంలోని కోడిచెర్ల మంజీర పరివాహక ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా తరలుతున్న రెండు ఇసుక ట్రాక్టర్లు, ఒక బొలేరో వాహనాలను శుక్రవారం వేకువజామున డోంగ్లీ మండలం కుర్లా సమీపంలో పట్టుకోని సీజ్ చేసినట్లు డోంగ్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. పోతంగల్ మంజీరా శివారులోని కోడిచెర్ల నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు, ఒక బొలేరో వాహనంతో ఇసుక లోడుతో ఎలాంటి అనుమతులు లేకుండా డోంగ్లీ గుండా వెళ్తుండగా పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇసుక తరలిస్తున్న వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో డోంగ్లీ తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశామని ఆయన తెలిపారు. మంజీర వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు సిబ్బంది బాల నర్సయ్య, బాలరాజు ఉన్నారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు శుక్రవారం ఒకే రోజు 146 మందికి శిక్షలు విధించాయి. పోలీసులు ఇటీవల జరిపిన వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని జిల్లాలోని వివిధ కోర్టులలో హాజరుపర్చగా 13 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 146 మందికి గాను రూ.2 లక్షల వరకు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
బామ్మర్దుల దాడి.. బావ ఆత్మహత్య


