ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఇప్పటికే చాలా పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరా గాంధీ స్టేడియంలో రూ.8 కోట్లతో ఇండోర్ స్టేడియం, అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు, మార్చి నాటికి గోదావరి నీటి సరఫరా పెంపు పనులు వేగవంతం చేస్తామన్నారు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందని, ఎన్నికల తర్వాత ఇక్కడి ఎమ్మెల్యే కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.


