క్రైం కార్నర్
రైలు పట్టాలు దాటుతూ వృద్ధురాలి మృతి
కామారెడ్డి టౌన్: రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ఇలా.. వనపర్తి జిల్లాకు చెందిన మిరిగిల్లా సరోజమ్మ (75) ఆదివారం కామారెడ్డి రైల్వే గేట్ సమీపంలో పట్టాలు దాటుతోంది. భవానీ నగర్ నుంచి స్నేహపురి కాలనీ వైపు వెళ్తుండగా, అదే సమయంలో వస్తున్న తిరుపతి స్పెషల్ రైలును ఆమె గమనించలేదు. వేగంగా వచ్చిన రైలు సరోజమ్మను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పట్టాల పక్కన పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై లింబాద్రి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతంతో మేకల కాపరి..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని వండ్రికల్ గ్రామంలో విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన మేకల కాపరి మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వేముల కిషన్రావు(25) సోమవారం మేకల మేత కోసం గ్రామ శివారులో గల మత్తడి ఒర్రెవద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న మేడిచెట్టు పైకెక్కి కొమ్మలు నరికే క్రమంలో చెట్టు పైనుంచి వెళ్లిన 11కేవీ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అతడు చెట్టుపైనే మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్యామ్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, 21 రోజుల వయస్సు గల కుమారుడున్నట్లు తెలిపారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని దగ్గి గ్రామ శివారులోగ 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఓ లారీ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి జరగడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


