పర్యావరణ సంరక్షణలో భాగస్వాములు కావాలి
బాన్సువాడ రూరల్: పర్యావరణ సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డివిజన్స్థాయి వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు వ్యర్థాలతో తయారు చేసిన ఆకర్షణీయ నమూనాలను ప్రదర్శించి ప్రతిభ చాటారు. షేక్ సలాం ప్రదర్శనలను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి మాట్లాడుతూ.. వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందడంతోపాటు వ్యర్థాలను సంపదగా మార్చే అలోచన పెరిగిందన్నారు.పోటీలలో కేజీబీవీ గాంధారి పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, పీఎంశ్రీ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల బాన్సువాడ ద్వితీయ స్థానం సాధించింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించి అభినందించారు. ఎంఈవో నాగేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు కుషాల్, వెంకటరమణ, భునేకర్ సంతోష్, నర్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


