రాజకీయ నేతలు మూకుమ్మడిగా దోచుకున్నారు
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రూ.వేల కోట్ల నిధులను రాజకీయ నాయకులు మూకుమ్మడిగా దోచుకున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు వార్డులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వం వద్ద పందులు, గాడిదల లెక్కలు ఉన్నాయి కానీ, మనుషుల లెక్కలు లేవని బీసీ గణనను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే కామారెడ్డి చౌరస్తాలో ఉరేసుకుంటానని, చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ప్రత్యర్థులు ఎంత ఇచ్చినా తీసుకుని, ఓటు మాత్రం కత్తెర గుర్తుకే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేతలు హరిశంకర్ గౌడ్, తాహెర్ మహ్మద్, అభ్యర్థులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలు ర పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మాధవ రావు తెలిపారు. ఈ నెల 5, 6, 7, 8 తేదీలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఎం.ప్రణీత్, ఎం.రాహుల్ పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కోలకొండ మల్లవ్వకు చెందిన గొర్రెల షెడ్డును శుక్రవారం ఏపీఎం ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లవ్వ గొర్రె పొటేళ్ల పెంపకం కోసం రూ. 2 లక్షల రుణాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. డీపీఎం సురేశ్ కుమార్, సర్పంచ్ వంకాయల శిరీష, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ సమాఖ్య అధ్యక్షులు భూదేవి, సీసీలు ఆంజనేయులు, వీవోఏలు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: నాసా ఒలంపియాడ్ పరీక్షలలో సరస్వతి శిశుమందిర్ హైస్కూల్(కామారెడ్డి) విద్యార్థులు ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు. నిశాంత్, రితేష్, రామ్ నిహల్, రిత్విక్ రెడ్డి విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అభినందించింది. నాసా ఒలంపియాడ్ రీసోర్స్ పర్సన్ డాక్టర్ సంజయ్, పాఠశాల అకాడమీ ప్రిన్సిపల్ నాగేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భిక్కనూరు: పెద్దమల్లారెడ్డి జీపీ పాలకవర్గాన్ని ఉపసర్పంచ్ చైతన్యతో పాటు ఉపాధి ఫీల్డు అసిస్టెంట్ కొండల్రెడ్డి అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సాయగౌడ్తో పాటు పలువురు వార్డు సభ్యులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్కు ఫిర్యాదు చేశారు. గురువారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను ఉప సర్పంచ్, ఫీల్డు అసిస్టెంట్లు చేశారని ఈ విషయాన్ని సర్పంచ్కు వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భిక్కనూరు: కంచర్లలోని అంగన్వాడీ కేంద్రాలను సీడీపీవో శోభారాణి శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు సూచించారు. పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఆమె వెంట సర్పంచ్ అరుణ, సూపర్వైజర్ మంగ ఉన్నారు.


