కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ: మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే బాన్సువాడ మున్సిపల్లో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ గృహంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ పట్టణం అభివృద్ధికి కేసీఆర్ రూ.650 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో రూ.60 నుంచి రూ.70 కోట్ల కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. పోచారం శ్రీనివాస్రెడ్డి తాను బాన్సువాడకు రాకముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినా బాన్సువాడను అభివృద్ధి చేయలేదని, 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచాక తాడ్కోల్ శివారులో 26 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశానని, బాన్సువాడలో సెంట్రల్ లైటింగ్, బాన్సువాడ–నిజామాబాద్కు డబుల్ రోడ్డు, నిజాంసాగర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్, ఉప కాలువలు, చెరువుల మరమ్మతులు చేశానని అన్నారు. చందూర్లో పోచారం శ్రీనివాస్రెడ్డి 6 ఎకరాలు కొనుగోలు చేసి ఇప్పటి వరకు పేదలకు పంచిపెట్టలేదని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని సిగ్గులేకుండా చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, అందరి లెక్కలు సరి చేస్తామని అన్నారు. 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బాడి శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేశారు. శనివారం బాన్సువాడకు కేటీఆర్ రానున్నట్లు తెలిపారు. గిర్ధావర్ గంగారెడ్డి, జుబేర్, నార్ల రత్నకుమార్, అంజిరెడ్డి, యలమంచలి శ్రీనివాస్రావు, ధర్మతేజ, చందర్, బాడి శ్రీనివాస్, అక్బర్ తదితరులున్నారు.


