ఎన్నికల నియమావళిని పాటించాలి
● ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలను నమోదు చేయాలి
● అదనపు కలెక్టర్ మధుమోహన్
కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు రిటర్నింగ్ అధికారి అందజేసిన ఖర్చుల రిజిస్టర్లో ఎన్నికల ఖర్చులన్నింటినీ ప్రతిరోజూ వోచర్లు, రసీదులతో సహా నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో ఖర్చుల ఖాతాలను సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వాహనాల వినియోగం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఊరేగింపులు నిర్వహించాలంటే ముందస్తుగా రిటర్నింగ్ అధికారి గానీ, సహాయ రిటర్నింగ్ అధికారి నుంచి గానీ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా వాహనాలు లేదా లౌడ్ స్పీకర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు తమ పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకుని రిటర్నింగ్ అధికారి ఆమోదం పొందాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేయరాదన్నారు. ఎన్నికల నిబంధనలపై ఏవైనా సందేహాలుంటే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళిని పాటించాలి


