కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత, డబుల్ బెడ్రూం ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రజావాణిలో 20,370 ఫిర్యాదులు రాగా 19,567 ఫిర్యాదులను పరిష్కరించమన్నారు. 803 వినతులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వినతులను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టరాదన్నారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 131 ఫిర్యాదులు