రాజమహేంద్రవరం సిటీ: జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొనడంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కూర్చునేందుకు సైతం బెంచీలు లేక వృద్ధులు, చిన్నారులు, మహిళలు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం సింహాచలం నుంచి కొండపల్లి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో, పలు రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడిచాయి. తాము ఎక్కాల్సిన రైళ్ల రాక కోసం ప్రయాణికులు ఎదురుతెన్నులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్లో కూర్చునేందుకు బెంచీలు సైతం లేక ప్లాట్ఫామ్పై, ఫుట్వే బ్రిడ్జి మెట్లపై కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్, బొకారో ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి, తిరుపతి – కాకినాడ సికింద్రాబాద్ – అనకాపల్లి, కోణార్క్ ఎక్స్ప్రెస్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. విజయవాడ వైపు వెళ్లే సంత్రాగచ్చి – తిరుపతి, కోరమండల్, ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు 3 నుంచి 6 గంటలు ఆలస్యంగా చేరుకున్నాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703) ఏకంగా పదిన్నర గంటలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్ రైలు వ్యాగన్ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడటంతో రైల్వే అధికారులు తక్షణమే స్పందించారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు రైల్వే సీటీ సుంకర చంద్రమౌళి తెలిపారు.
ఫ కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
ఫ ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు
ఫ రాజమహేంద్రవరంలో
ప్రయాణికులకు కష్టాలు


