సాగరుడు అలల కరవాలాలతో విరుచుకుపడుతూండటంతో జగన్నాథుని ఆలయం ముప్పు అంచున కొట్టుమిట్టాడుతోంది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలో 1999లో నిర్మించిన ఈ ఆలయానికి విశిష్ట నేపథ్యం ఉందని స్థానిక మత్స్యకారులు చెబుతారు. ఒడిశాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలో రథోత్సవం అనంతరం సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుని దారు విగ్రహాలను నిమజ్జనం చేయగా.. అవి ఉప్పాడ తీరానికి చేరుకుని, ఇక్కడి మత్స్యకారుల వలలకు చిక్కాయి. దీంతో, పూరిలోని మూలమూర్తులకు ప్రతిరూపాలుగా భావిస్తూ.. స్థానికులు విరాళాలతో మూలపేటలో ఆలయం నిర్మించి, ఆ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. దీని అభివృద్ధికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఈ ఆలయం పూర్తి శిథిలావస్థకు చేరింది. దీనికితోడు, సముద్ర కెరటాలు విరుచుకుపడుతూండటంతో ఆలయ మండపం కుప్పకూలిపోయింది. రానున్న రోజుల్లో ఈ ఆలయం పూర్తిగా సముద్ర గర్బంలో కలిసే ప్రమాదం ఉందని, ఇప్పటికై నా దాతలు, అధికారులు దీని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
– కొత్తపల్లి


