● ఘనంగా రాఖీ పౌర్ణమి ఉత్సవాలు
● దత్తాత్రేయుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాఖీలు కట్టేందుకు తరలివస్తున్న మరాఠీ భక్తులు
దత్తాత్రేయుడికి రాఖీలు కడుతున్న భక్తులు
పిఠాపురం: దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలం పిఠాపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది భక్తుల రాకతో దత్తాత్రేయుని ఆలయాలు కిటకిటలాడాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో పాటు సుమారు 50 వేల మంది మహారాష్ట్ర భక్తులు శుక్రవారం దత్తాత్రేయునికి రాఖీలు కట్టారు. దీంతో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం భక్తులతో కిక్కిరిసింది.
శ్రీపాదునికి రాఖీ పంపిన వాసవి అమ్మవారు
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభునికి స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి గ్రామోత్సవంగా సంస్థానానికి వెళ్లి అమ్మవారి రాఖీ సమర్పించారు. ఆయనకు సోదరిగా కన్యకా పరమేశ్వరి రాఖీ కట్టడం ఇక్కడ ఆనవాయితీ. అనంతరం ఈఓ ఆర్.సౌజన్య ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి శ్రీపాదుని తరఫున సారె సమర్పించారు.
లక్ష మల్లెలతో అర్చన
ఈ సందర్భంగా పాదగయ క్షేత్రంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు ‘లక్ష మల్లెల అర్చన’ నిర్వహించారు.


