పిఠాపురం: కొత్త సమస్యలు సృష్టిస్తున్న పట్టు పరిశ్రమ శాఖ డీడీ గీతారాణి వస్తే.. తాము సమావేశానికి వచ్చేది లేదని పట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సమావేశాన్ని పట్టు రైతులు బహిష్కరించారు. పట్టు రైతుల సమస్యల పరిష్కారం, సూచనలు, సలహాల కోసం గురువారం చేబ్రోలు పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద పట్టు పరిశ్రమ శాఖ డీడీ గీతారాణి ఆధ్వర్యంలో సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో ముందుగా రైతులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని, అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ డీడీ గీతారాణి పట్టు పరిశ్రమను దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమెను వెంటనే బదిలీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సమావేశాన్ని తాము బహిష్కరిస్తే, వేరేచోట వ్యక్తులతో ఫోటోలు తీయించి సమావేశం నిర్వహించినట్లు ప్రభుత్వానికి పంపించారని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
సమావేశాన్ని బహిష్కరించిన పట్టు రైతులు


