పార్కింగ్ చేసిన కార్లే అతడి లక్ష్యం
రూ.25 లక్షల విలువైన ఆభరణాల స్వాధీనం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేవాలయాల వద్ద పార్క్ చేసిన కార్ల డోర్లు చాకచక్యంగా తెరిచి లోపల ఉన్న ఆభరణాలు చోరీ చేసే అంతర్ జిల్లా నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ స్టేషన్లో ఏడీసీపీ ఎం.రాజారావు తెలిపిన వివరాల మేరకు కోనసీమ అంబేడ్కర్ జిల్లా అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామానికి చెందిన చింత గణేష్ ఏడో తరగతి వరకూ చదివి కారు డ్రైవర్గా పనిచేసేవాడు. 15 ఏళ్లు ఖతార్ దేశంలో డ్రైవర్గా చేసి 2019లో దేశానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ డ్రైవర్గా చేస్తూ దురలవాట్లకు బానిస కావడంతో వచ్చే డబ్బులు చాలక సులభంగా డబ్బులు సంపాదించేందుకు నేరాలకు పాల్పడుతున్నారు.
తారాపేటలో అరెస్టు
2025 ఏప్రిల్లో దుర్గగుడి ఓం టర్నింగ్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు డోర్లు తెరిచి లోపల బ్యాక్ సీట్లో ఉన్న ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ సేకరించిన ఆధారాలు, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి చింత గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరం అంగీకరించడంతో అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్నారు.


