
ఆచారాలను ‘గంట‘ కలిపేశారు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను వివాదాలకు వేదికగా జనసేన నేతలు మార్చేశారు. ఉత్సవాల సందర్భంగా రోజూ స్వామివారికి వాహన సేవ నిర్వహిస్తుంటారు. వాహనాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించే సమయంలో గుడిలో జేగంట మోగిస్తుంటారు. గ్రామంలో ఒక కుటుంబీకులు జేగంట కొట్టడం ఆచారంగా వస్తోంది. కొంతకాలంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లే గుడిలో గంట కొట్టాలనే కొత్త ఆచారానికి నాంది పలికారు. ఈ నేపథ్యంలో గంట కొట్టే విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జనసేన నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మూడు రోజులుగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. రోజూ రెండు వర్గాలు తామంటే తామంటూ బాహాబాహీలకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించే సమయంలో రెండు వర్గాలు కొట్లాటకు దిగడంతో పోలీసులు వారిని తప్పించి ఆలయ అర్చకుడితో జేగంట మోగించి వాహన సేవను నిర్వహించారు. చివరి రోజు రథోత్సవం తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని పోలీసులు జనసేన నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్చార్జి చెప్పినా..
గంట కొట్టే విషయంలో జనసేనకు చెందిన రెండు వర్గాలు ఆలయానికి చేరుకుని పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ను ఈ విషయమై నిలదీశారు. తాము ఎన్నికల్లో కష్టించి పనిచేశామని, తమకు అవకాశం ఇవ్వకుండా వేరే వర్గానికి అవకాశం ఇస్తారా అంటూ ఒక వర్గం. వారు ఇటీవలే పార్టీలోకి వచ్చారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము జనసేనకు మద్దతుగా పని చేస్తున్నాం.. మాకే అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుబట్టారు. వివాదాలు లేకుండా ఆలయ ఆచారాలను నిర్వహించాలని ఇన్చార్జ్ చెప్పినప్పటికి లెక్క చేయని రెండు వర్గాలు వాగ్వాదాలకు దిగడంతో ఆలయంలో ఉత్సవ వేళ గందరగోళంగా మారింది. కాగా ఆలయంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న జేగంట స్థానంలో జనసేన నేతలు కొత్త గంటను తెచ్చి పెట్టడం విమర్శలకు దారితీసింది. ఉన్నతాధికారులు కలగజేసుకుని శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చేబ్రోలులో రాముడి సాక్షిగా
జనసేన వర్గాల కొట్లాట
ఆలయంలో జేగంట కొట్టే
ఆచారానికి అపచారం

ఆచారాలను ‘గంట‘ కలిపేశారు