జాతీయ కళా డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో కోనసీమ కళాకారులు
కొత్తపేట: దేశవ్యాప్త కళాకారులతో న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరు గరగ నృత్యం కళాకారులు పాల్గొన్నారు. కొత్తపేట మండలం పలివెలకు చెందిన కొమారిపాటి ఏసువెంకటప్రసాద్, మండపేట రూరల్ మండలం తాపేశ్వరానికి చెందిన కొరివి కళ్యాణ్కు ఈ అవకాశం దక్కింది. ఈ ఏడాది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో దేశ వ్యాప్తంగా వివిధ కళారూపాలకు చెందిన 5,196 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. కాగా ఢిల్లీలోని భారత సంగీత, నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆయా కళాబృందాల్లో ఒక్కో బృందం నుంచీ ఇద్దరి చొప్పున మొత్తం 100 మందిని ఎంపిక చేసి ‘జయతి జయమమ్మా భారతం’ పేరుతో డాక్యుమెంటరీ ప్రోగ్రాం చేశారు. ఇందులో కోనసీమ జిల్లాకు చెందిన ఏసువెంకటప్రసాద్, కళ్యాణ్ గరగ నృత్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్యాపుణిచ, సెక్రటరీ రాజుదాస్ తదితర ప్రముఖులు అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. ఏసు వెంకటప్రసాద్ గరగ నృత్యం జానపద కళా విభాగంలో సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారు.


