భూపాలపల్లి అర్బన్: నేత్రదానం చేయడం ద్వారా మరణానంతరం ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. 41వ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ దేవేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేత్రదానం ఒక కుటుంబ సంప్రదాయంగా మారాలని, సమాజంలో నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశం అనంతరం ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సందీప్, డాక్టర్ రాహుల్, ఆప్తాలమిక్ అధికారి బూరుగు రవికుమార్, సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, హెచ్ఈఓ మురళీధర్రెడ్డి, జమాలుద్దీన్, సుధీర్ పాల్గొన్నారు.
ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి


