ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి రూరల్: ప్రాధాన్యత రంగాలకు రూ.2971.20 కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా.. డిసెంబర్ మాసం నాటికి రూ.1937.21 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కన్సల్టేటివ్, జిల్లాస్థాయి రివ్యూ కమిటీ, జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కమిటీ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ తయారుచేయాలని సూచించారు. రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందించాలని తెలిపారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు తిరిగి రెన్యూవల్ చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆపుతున్నారని అన్నారు. రెన్యూవల్ కాకుండా ఇబ్బందులు పడే 100 మంది రైతులను చూపిస్తానని అసంతృప్తి వ్యక్తంచేశారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా రిలేషన్ మెయింటైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్సాయి, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.


