జీపీ ట్రాక్టర్లకు రిపేర్లేవి!
మరమ్మతులు లేక
నిలిచిన చెత్త సేకరణ
పేరుకుపోతున్న చెత్త..
ట్రాక్టర్ల రిపేర్ల సమాచారం లేదు..
కాళేశ్వరం: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కీలకంగా ఉండాల్సిన చెత్త సేకరణ ట్రాక్టర్లు పలు పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు లేక మూలకు పడ్డాయి. రెండేళ్ల నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు పంచాయతీల భారం కార్యదర్శులు భరించారు. దీంతో నిధుల లేమితో నిర్వహణ అంతంతే నిర్వహించారనే విమర్శలు లేకపోలేదు. కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టి రెండున్నర నెలలు కావస్తున్నా పాత ట్రాక్టర్లకు మరమ్మతులు, నిర్వహణకు నిధులులేక పలు గ్రామాల్లో కొంతమంది సర్పంచులు స్వంత ఖర్చులు పెట్టి మరమ్మతులు చేసినా, పలు పంచాయతీల్లో చెత్త సేకరణ చేయడం లేదు. దీంతో కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లు పనికిరావడం లేదు. కొన్ని గ్రామపంచాయతీల్లో నెలల తరబడి ట్రాక్టర్లు షెడ్ల వద్ద నిలిచిపోవడంతో చెత్త సేకరణకు అడ్డంకిగా మారింది.
నిధులొచ్చినా..
జీపీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. వచ్చిన కొంతమేర నిధులతో పాత సర్పంచులు చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు చేయాలని పంచాయతీ చుట్టూర ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఖర్చులు పెట్టిన కార్యదర్శులు తమ బాకీల వసూలు పనిలో పడ్డారు. ప్రస్తుతం కొత్త సర్పంచులు చేపట్టిన పనుల భారంతో చెల్లింపులు చేయలేక వారికి గొడవలు మొదలయ్యాయని తెలిసింది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 12 మండలాల్లో 248 పంచాయతీల్లో ట్రాక్టర్లు ఉన్నాయి. భూపాలపల్లిలో 4, మొగుళ్లపల్లి 5, రేగొండ 2, చిట్యాల 3, టేకుమట్ల 4, కాటారం 4, మహాముత్తారం 4, మహదేవపూర్ 4, మల్హర్ 3, పలిమెల 2 గ్రామపంచాయతీ ట్రాక్టర్లు రిపేర్లతో మూలకుపడ్డాయి.
లైసెన్స్, ఇన్సూరెన్స్ లేక!
పలు జీపీల్లో ట్రాక్టర్లు నడిపేందుకు లైసెన్స్, అనుభవం లేని డైవర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ట్రాక్టర్లపై అవగాహన లేకపోవడంతో నిత్యం మరమ్మతులకు కారణం అవుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు జీపీ ట్రాక్టర్లకు సంబంధించి సగానికిపైగా ట్రాక్టర్లకు ఇన్సురెన్స్ కూడా లేదని తెలిసింది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో జీపీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో కోర్టు పంచాయతీ నుంచి సదరు మరణించిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది దృష్టిలో ఉంచుకొని జీపీ ట్రాక్టర్లకు లైసెన్స్, ఇన్సురెన్స్ కూడా సరిగ్గా చూసుకోవాల్సి ఉంది.
నిధుల కొరతతో
కొట్టుమిట్టాడుతున్న జీపీలు
లైసెన్స్లేని డ్రైవర్లు..
ఇన్సూరెన్స్ లేని ట్రాక్టర్లు
దృష్టిసారించని అధికారులు
చెత్త సేకరణ లేకపోవడంతో పలు పంచాయతీల్లో వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తూ, దోమల సమస్య తీవ్రతరం అవుతుంది. పాఠశాలలు, అంగన్వాడీలు, కాలనీలు, హోటళ్లు, లాడ్జిలు, కిరాణ దుకాణాలు, పాన్ డబ్బాలు, పాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ గ్రామాల లక్ష్యాలపై పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉందని విమర్శలు ఉన్నాయి. చిన్నపాటి మరమ్మతులతో తిరిగి వినియోగంలోకి వచ్చే ట్రాక్టర్లను పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. తక్షణమే ట్రాక్టర్లకు మరమ్మతులు చేసి చెత్త సేకరణను పునఃప్రారంభించి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని జీపీల్లో ట్రాక్టర్లు ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్లు ఉంటే పంచాయతీల్లోనే చేయిస్తారు. జిల్లాలో జీపీ ట్రాక్టర్లకు రిపేర్లు ఎక్కడ ఉన్నవి సమాచారం లేదు. ఉన్నతాధికారులు కూడా ట్రాక్టర్లపై సమాచారం అడగలేదు.
– శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి
జీపీ ట్రాక్టర్లకు రిపేర్లేవి!
జీపీ ట్రాక్టర్లకు రిపేర్లేవి!
జీపీ ట్రాక్టర్లకు రిపేర్లేవి!


